అమరావతి ,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా రైతు రోశయ్యను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక X లో పోస్టు చేస్తూ ఆయన రైతు కృషిని ప్రశంసించారు.
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన రైతు రోశయ్య, 80 ఏళ్ల వయసులో కూడా కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ నెలకు రూ.20 వేలకుపైగా ఆదాయం పొందుతున్నారని సీఎం పేర్కొన్నారు. ప్రకృతిని తల్లిలా భావిస్తూ సాగు చేస్తున్న ఆయన విజయగాథ స్ఫూర్తిదాయకమని అన్నారు.2016లో రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రేరణ పొంది రోశయ్య సహజ సాగు ప్రారంభించారని తెలిపారు. కృషి, పట్టుదలతో ఆయన సాధిస్తున్న విజయాలు ఇతర రైతులకు ఆదర్శమని సీఎం అన్నారు.రైతు రోశయ్యకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ప్రకృతి వ్యవసాయం ద్వారా మరింత మంది రైతులు ముందుకు రావాలని ఎన్.చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
