అమరావతి,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తిరుపతి జిల్లాలో నిర్మించిన 2,064 టిడ్కో ఇళ్లను ఈ నెల 17న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రారంభించి లబ్ధిదారులకు అందించనున్నారు.
నాయుడుపేట సమీపంలో భారీ ప్రాజెక్ట్
తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీపంలోని బిరదవాడ వద్ద ఈ ఇళ్లను నిర్మించారు. జాతీయ రహదారి 16 పక్కన 36 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.168 కోట్ల వ్యయంతో మొత్తం 2,064 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను సిద్ధం చేశారు.
ఉగాది కానుకగా ఇళ్ల పంపిణీ
తెలుగు నూతన సంవత్సరం అయిన ఉగాది సందర్భంగా పేదల సొంతింటి కలను నిజం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఉగాదికి ముందుగానే ఈ నెల 17న ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.
మధ్యలో ఆగిన పనులు.. మళ్లీ పూర్తి
గతంలో ప్రభుత్వం ప్రారంభించిన ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపు 70 శాతం పూర్తయ్యాక ఎన్నికల కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెండింగ్ పనులను పూర్తి చేసి ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.దీంతో సంవత్సరాలుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల కల నెరవేరబోతోంది.
