యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో పాత గుట్ట రోడ్డు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన కృషి అగ్రి డ్రోన్ సెంటర్” ను ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రిబ్బన్ కట్ చేసి అగ్రి డ్రోన్ సేవలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం చేకూరుతుందని తెలిపారు. అగ్రి డ్రోన్ల ద్వారా పంటలపై మందులు పిచికారీ చేయడం, ఎరువులు వేయడం, పంటల పరిస్థితిని పరిశీలించడం వంటి పనులు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో చేయగలమని అన్నారు. దీని వల్ల రైతుల శ్రమ తగ్గడంతో పాటు దిగుబడులు పెరగడానికి కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు.వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి యువత ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం గ్రామీణ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అనంతరం అగ్రి డ్రోన్ సెంటర్ నిర్వాహకులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
