మార్చి 15(నేటి తెలుగు పత్రిక): పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పైప్లైన్ గ్యాస్ ఉపయోగిస్తున్న వారు ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్లు కొనసాగించరాదని స్పష్టం చేసింది.పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడుతున్న వినియోగదారులకు కొత్తగా ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వవద్దని గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కనెక్షన్లు ఉన్నవారు తమ సిలిండర్లను సరెండర్ చేయాలని సూచించింది. పైప్లైన్ గ్యాస్ అందుబాటులో ఉండగా మళ్లీ ఎల్పీజీ సిలిండర్లు వినియోగించడం సరైంది కాదని కేంద్రం పేర్కొంది.ఒకవేళ PNG వాడుతున్న వినియోగదారుల వద్ద LPG సిలిండర్లు ఉంటే వాటిని తిరిగి తీసుకోవాలని కూడా ఏజెన్సీలకు సూచించింది. గ్యాస్ కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల ఎల్పీజీ సరఫరాపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. గ్యాస్ బుకింగ్ చేసిన అందరికీ సకాలంలో సరఫరా జరుగుతుందని అధికారులు తెలిపారు. అవసరం లేకపోయినా ముందస్తు బుకింగ్స్ చేయవద్దని వినియోగదారులను కోరారు.సుజాత శర్మ, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ) మాట్లాడుతూ ఇళ్లకు, ఆస్పత్రులకు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వాణిజ్య సిలిండర్ల సరఫరాపై రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
