హైదరాబాద్ ,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్ట్ను ప్రకటించింది. నగరంలో త్వరలోనే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లోని హయత్నగర్ లో ఓల్డ్ నేషనల్ హైవేపై సాయిబాబా ఆలయం నుంచి జీ స్కూల్ వరకు రూ.10 కోట్లతో చేపట్టిన నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో ఉన్న మాదిరిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ను నిర్మించనున్నట్లు తెలిపారు.ఈ ఫ్లైఓవర్ ఎల్. బి. నగర్ నుంచి హయత్నగర్ వరకు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే దీనికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.200 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా అబ్దుల్లాపూర్మెట్, ఇంజాపూర్, కోహెడ పండ్ల మార్కెట్ ప్రాంతాల్లో రోడ్లను నాలుగు లైన్లుగా విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు సర్వీస్ రోడ్ల అభివృద్ధికి సుమారు రూ.10 వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణంతో నగర ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు హైదరాబాద్ నగర రూపురేఖలు కూడా మారనున్నాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మధు యాష్కీ గౌడ్, మల్రెడ్డి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
