మార్చి 15(నేటి తెలుగు పత్రిక): తిరుమలలో శ్రీవారి భక్తులకు మరో శుభవార్త అందింది. భక్తులకు మరింత సౌకర్యంగా అన్నదానం అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కొత్త అన్నప్రసాద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.120 కోట్ల విరాళం అందించనుంది.టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ వంటశాల (మోడ్రన్ కిచెన్)తో పాటు పెద్ద అన్నప్రసాద కేంద్రాన్ని నిర్మించనున్నారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తులకు మరింత వేగంగా, మెరుగైన సౌకర్యాలతో అన్నదానం అందించవచ్చు.
ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఆటోమేషన్ టెక్నాలజీని ఉపయోగించి వంట ప్రక్రియను ఆధునీకరించనున్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నదాన సేవలను టెక్నాలజీతో మెరుగుపరచాలని సూచించగా, ఆ దిశగా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయం లో ఒకేసారి వేలాది మంది భక్తులకు అన్నదానం అందించే సౌకర్యం ఉంది. కొత్తగా నిర్మించనున్న కేంద్రంతో పాటు రెండు ప్రత్యేక డైనింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేయాలని టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది.గత ఏడాది ముఖేష్ అంబానీ తిరుమల సందర్శన సమయంలో అన్నదాన సేవల కోసం విరాళం ప్రకటించారు. ఆ విరాళంతోనే ఈ కొత్త అన్నప్రసాద కేంద్రం నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
