మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు, పోలీసు అధికారులనూ వదలడం లేదు. తాజాగా జగిత్యాల్ జిల్లాలో ఓ పోలీస్ అధికారినే టార్గెట్ చేసి సైబర్ కేటుగాళ్లు రూ.95,500 దోచుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం, జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI)కు ఇటీవల ఓ వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్ సమయంలో మాట్లాడిన వీడియోను సైబర్ నేరగాళ్లు రికార్డ్ చేశారు. అనంతరం దాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు.దీంతో భయపడిన ఏఎస్సై మూడు విడతల్లో రూ.95,500ను నిందితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. తర్వాత మోసపోయినట్లు గుర్తించిన ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇలాంటి సైబర్ మోసాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్కు స్పందించకూడదని, వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
