మార్చి 15(నేటి తెలుగు పత్రిక): జమ్మూ కాశ్మీర్ లో భారత భద్రతా దళాలు మరోసారి ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి. బారాముల్లా జిల్లా లోని ఉరి సెక్టార్ లో చొరబాటుకు ప్రయత్నించిన ఓ పాకిస్తాన్ ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుబెట్టింది.భద్రతా దళాలు మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి బుఖార్ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. మార్చి 14–15 మధ్య రాత్రి నిఘా సమాచారంతో ఆర్మీ అప్రమత్తమైంది. సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులపై కాల్పులు జరగగా ఒక ఉగ్రవాది అక్కడికక్కడే హతమయ్యాడు.
ఈ ఘటన అనంతరం ప్రాంతమంతా భద్రతా దళాలు కంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మరెవరైనా ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారా అనే కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్తో సరిహద్దు గుండా చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా రాజౌరి జిల్లా లోని నియంత్రణ రేఖ సమీపంలో కూడా మరో చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. నౌషేరా సెక్టార్ పరిసర ప్రాంతాల్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు కనిపించడంతో భద్రతా దళాలు వారిని ఆపేందుకు ప్రయత్నించాయి. ఈ సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా, మరో వ్యక్తి కోసం ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
