మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేస్తూ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.తాజాగా మొత్తం 2,764 మంది లబ్దిదారులకు రూ.28.50 కోట్లు విడుదల చేశారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమం ప్రారంభమైన వారం రోజుల్లోనే ఈ నిధులను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
పెండింగ్ బిల్లుల క్లియరెన్స్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయడానికి ప్రభుత్వం పెండింగ్ బిల్లులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా:
- L-3 జాబితాలో ఉన్న 1,200 మందికి రూ.12.06 కోట్లు
- బ్యాంక్ వద్ద పెండింగ్లో ఉన్న 653 మందికి రూ.7 కోట్లు
- అభ్యంతరాల కారణంగా ఆగిపోయిన 911 మందికి రూ.9.40 కోట్లు విడుదల చేశారు.
ఈ నిధులు ఇప్పటికే లబ్దిదారుల ఖాతాల్లో జమ కావడంతో చాలా మంది ఇళ్ల నిర్మాణాన్ని మళ్లీ వేగవంతం చేస్తున్నారు.
ఏప్రిల్లో రెండో విడత
ఇప్పటికే తొలి విడతలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడత జాబితాను కూడా ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. ఏప్రిల్లో రెండో విడతలో మరికొంతమందికి ఇళ్లను మంజూరు చేసే అవకాశం ఉంది.ఈ పథకం కింద స్థలం ఉన్న పేద కుటుంబాలకు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు.
