- జిల్లాలో విజయవంతంగా పీ4 కార్యక్రమం అమలు
- రెడ్ క్రాస్ జిల్లా శాఖ భాగస్వామ్యం భేష్
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): జిల్లాలో పీ4 కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని.. మార్గదర్శుల చేయూతతో బంగారు కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయని, ఇంత మంచి కార్యక్రమానికి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) జిల్లా శాఖ అందిస్తున్న భాగస్వామ్యం గొప్పదని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.ఆదివారం విజయవాడ గాంధీనగర్లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యాలయంలో పీ4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శుల సహకారంతో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ను కలెక్టర్ లక్ష్మీశ.. ప్రముఖ పారిశ్రామికవేత్త చల్లా రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి, అడ్వాన్స్ ఆక్వా బయోటెక్నాలజీస్ ఛైర్మన్ డా. పి.శ్రీనివాసులు, ఐఆర్సీఎస్ రాష్ట్ర శాఖ ఛైర్మన్ వైడీ రామారావు, జిల్లా శాఖ ఛైర్మన్ డా. జి.సమరం తదితరులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పీ4తో సహా వివిధ సేవా కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో జిల్లా కమిటీ విశేష కృషిచేస్తోందన్నారు. గౌరవ సీఎం పిలుపుతో వివిధ రంగాల్లోని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సేవాతత్పరులు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారన్నారు. జిల్లాలో దాదాపు 78 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని.. అయిదువేల మంది మార్గదర్శులు రిజిస్టర్ అయ్యారని తెలిపారు. మార్గదర్శులు అందించే సహకారంతో వస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మరింత ముందడుగు వేసేలా చొరవచూపుతున్నట్లు తెలిపారు.ప్రముఖ పారిశ్రామికవేత్త చల్లా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సేవాభావంతో ఆపన్నులకు అభయహస్తం అందిస్తూ ముందుకు సాగుతున్న రెడ్ క్రాస్ సొసైటీ ఏ కార్యక్రమం చేపట్టినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ప్రొఫెసర్ కె.మధుమూర్తి మాట్లాడుతూ ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ అందిస్తున్న సేవలు అనేక మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ కళాశాల విద్యార్థులను కూడా కార్యక్రమాల్లో పెద్దఎత్తున భాగస్వాములను చేయాలన్నారు.అడ్వాన్స్ ఆక్వా బయోటెక్నాలజీస్ ఛైర్మన్ డా. పి.శ్రీనివాసులు మాట్లాడుతూ రెడ్క్రాస్ జిల్లా కమిటీ చేస్తున్న సేవలను స్వయంగా చూశానని, ఈ కార్యక్రమంలో తనవంతు సహాయం అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఛైర్మన్ వైడీ రామారావు, వైస్ ఛైర్మన్ పి.రామచంద్రరాజు, జిల్లా ఛైర్మన్ డా. జి.సమరం తదితరులు రెడ్క్రాస్ సేవలను, భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. పీ4 కార్యక్రమం ద్వారా ఎన్నో పేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు.కార్యక్రమంలో జిల్లా శాఖ వైస్ఛైర్మన్ డా. వెలగా జోషి, సెక్రటరీ ఇ.చిట్టిబాబు సభ్యులు బలరాం, జయరాజు, భాష్యం జోషి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



