మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): డ్రగ్స్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఎన్.చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన ఆయన, క్రమశిక్షణ విషయంలో రాజీ ఉండదని మరోసారి సందేశం ఇచ్చారు.మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఘటనలో పుట్టా మహేష్ కుమార్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. యాంటీ నార్కోటిక్స్ అధికారులు నిర్వహించిన టెస్టుల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం రావడంతో టీడీపీ అధిష్టానం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది.
పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలగకుండా పుట్టా మహేష్ను తాత్కాలికంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధికారికంగా షోకాజ్ నోటీసు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. సరైన సమాధానం ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా, తనపై వచ్చిన ఆరోపణలను పుట్టా మహేష్ ఖండిస్తున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండగా, వై. ఎస్. షర్మిల వెంటనే పుట్టా మహేష్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.పుట్టా మహేష్ ఇచ్చే వివరణ తర్వాత టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
