మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెట్రోకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశముందని మంత్రి పి. నారాయణ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో కేంద్రం నుంచి ఆమోదం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం మెట్రో నిర్మాణ పనుల కోసం టెండర్లను ఆహ్వానించనున్నట్లు చెప్పారు.
విశాఖలో జరిగిన రీజినల్ వర్క్షాప్లో మంత్రి మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్ట్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. రైడర్స్ సంస్థ ప్రాజెక్టుపై అధ్యయనం చేస్తోందని, మరో రెండు నెలల్లో ఈ అధ్యయనం పూర్తయ్యే అవకాశముందని పేర్కొన్నారు. మెట్రో నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి మూడు సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అలాగే హైదరాబాద్లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ తరహాలో విశాఖపట్నంలో సెమీ రింగ్ రోడ్ నిర్మాణాన్ని కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రింగ్ రోడ్ పూర్తయితే నగరంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్పై విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యయనం కొనసాగుతోందని చెప్పారు.
మెట్రో ప్రాజెక్ట్ తొలి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు నిర్మించనున్నారు. మొత్తం 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లుగా ఈ మెట్రోను అభివృద్ధి చేయనున్నారు. స్టీల్ ప్లాంట్–కొమ్మాది, ఓల్డ్ పోస్టాఫీస్–గురుద్వారా, చినవాల్తేరు–తాటిచెట్లపాలెం మార్గాల్లో మెట్రో రూట్లు ఉండనున్నాయి. ఇందులో సుమారు 20.16 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో నిర్మాణం చేపట్టనున్నారు.ఈ మెట్రో ప్రాజెక్ట్ను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి అమలు చేయనుండగా, కేంద్రం కూడా తన వాటా నిధులు కేటాయించేందుకు ముందుకొచ్చింది. అలాగే త్వరలోనే విజయవాడ మెట్రో ప్రాజెక్ట్కు సంబంధించిన సర్వే కూడా ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.
