మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో విమాన ప్రయాణ సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో మరో రెండు కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఈ ఎయిర్పోర్ట్లకు జూన్ నెలలో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కొత్త ఎయిర్పోర్ట్లను వరంగల్ సమీపంలోని మామునూరు మరియు ఆదిలాబాద్ ప్రాంతాల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో నిర్మాణ పనులను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సుమారు రూ.850 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ను వరంగల్ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇక ఆదిలాబాద్లో సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే 415 ఎకరాల భూమి సేకరించగా, మిగిలిన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో సుమారు 2.9 కిలోమీటర్ల పొడవు గల రన్వే నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పౌర విమానాలతో పాటు మిలిటరీ విమానాలు కూడా దిగేలా రన్వే నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే డిఫెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది.
ప్రస్తుతం తెలంగాణలో ప్రయాణికుల కోసం ప్రధానంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే అందుబాటులో ఉంది. కొత్తగా మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లు ప్రారంభమైతే రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలకు విమాన సౌకర్యం మరింత సులభం కానుంది. దీనివల్ల ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
