అమరావతి, మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి తెలుగువారికి గౌరవకరమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు.ఆంధ్రుల కోసం ప్రత్యేక రాష్ట్ర సాధనకు పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆయన 58 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేసి అమరజీవిగా నిలిచారని గుర్తుచేశారు.ఈ సందర్భంగా రాజధాని అమరావతి లో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందదాయకమని మంత్రి పేర్కొన్నారు. శాంతి, అహింస, సత్యాగ్రహ మార్గంలో ప్రత్యేక రాష్ట్ర సాధనలో విజయం సాధించి ఆంధ్రుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడని ఆయన కొనియాడారు.
