అమరావతి, మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): అమరావతిని ప్రతి ఒక్కరూ గర్వంగా “నా రాజధాని” అని చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు.అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండటంతో పాటు బలమైన రాజధాని కూడా అవసరమని పేర్కొన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతి ఎలా అభివృద్ధి చెందుతుందో ప్రజలే చూస్తారని తెలిపారు. రాజధాని అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రబిందువుగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, ప్రతి వర్గానికీ న్యాయం చేసేలా పని చేస్తున్నామని చెప్పారు.ఆర్యవైశ్యుల సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. గత ప్రభుత్వంలో వ్యాపారాలు చేసుకోవడానికి భయపడే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఎలాంటి భయాందోళనలు లేకుండా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. దాన ధర్మాలకు ఖర్చు చేసే వర్గంగా ఆర్యవైశ్యులు ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా అదే సంకల్పంతో ఆర్యవైశ్యులు ఏర్పాటు చేశారని తెలిపారు. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పెనుగొండను “వాసవీ పెనుగొండ”గా మార్చినట్లు వెల్లడించారు.ఇంటింటికి తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి “అమరజీవి జలధార” అని పేరు పెట్టినట్లు తెలిపారు. నీరు తాగే ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములును స్మరించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపారని అన్నారు.అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమతూకంతో కొనసాగిస్తూ హెల్తీ–వెల్తీ–హ్యాపీ సమాజం నిర్మించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగుపడితేనే పొట్టి శ్రీరాములు త్యాగానికి నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని ఆయన అన్నారు.
