అమరావతి,మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు పదో తరగతి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. తొలిసారిగా ప్రభుత్వం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా పొందే సదుపాయాన్ని కల్పించగా, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ సేవను వినియోగించారు.ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ (9552300009) ద్వారా విద్యార్థులు సులభంగా హాల్ టికెట్లు పొందారు. ఈ సేవకు మొత్తం 3,16,990 హిట్లు నమోదు కాగా, 2,38,728 మంది విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు.
ఇక విద్యాశాఖ నిర్వహిస్తున్న లీప్ యాప్ ద్వారా 65,477 మంది విద్యార్థులు హాల్ టికెట్లు పొందగా, అత్యధికంగా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా 7,53,834 మంది విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.ఈసారి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో డిజిటల్ అవగాహన గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి ఫిజికల్ హాల్ టికెట్లు తీసుకునేవారు. అయితే ఈసారి డిజిటల్ సేవలను వినియోగిస్తూ లక్షల సంఖ్యలో విద్యార్థులు ఆన్లైన్, మనమిత్ర, లీప్ యాప్ ద్వారా హాల్ టికెట్లు పొందడం విశేషంగా మారింది.
