హైదరాబాద్, మార్చి 16(నేటి తెలుగు పత్రిక): ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసిన పలువురిని సన్మానించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం, మెడికల్ క్యాంపులు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, తలసేమియా బాధితులకు అండగా నిలిచిన సేవాదాతలను ఈ సందర్భంగా గౌరవించారు.ముఖ్యంగా గుడివాడ, మచిలీపట్నం, పామర్రు మండలం నిమ్మకూరు, తోట్లవల్లూరు, పెనమలూరు ప్రాంతాల్లో ట్రస్ట్ తరఫున విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి కు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ అవార్డును అందజేసి నారా భువనేశ్వరి ప్రత్యేకంగా సన్మానించారు.
వీరంకి గురుమూర్తి నేతృత్వంలో సుమారు 1200 మందికి పైగా రక్తదానం చేయించడం, వేలాది మందికి ఉచితంగా మందులు, కళ్లజోళ్ల పంపిణీ చేయడం, కంటి ఆపరేషన్లు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా సుమారు 2500 మంది పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేస్తూ విద్యా రంగానికీ ఆయన విశేష సహకారం అందించారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివిధ రంగాల్లో సేవలందించిన 50 మంది మహిళలను జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర, APSRTC చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.
