ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రజా వాగ్గేయ కళాకారులు సాంబరాజు యాదగిరి
సూర్యాపేట,మార్చి 16(నేటి తెలుగు పత్రిక): నిద్రపోతున్న సమాజాన్ని తట్టి లేపేది సమాజ గమనాన్ని ముందుకు నడిపించేది పాట ఒక్కటేనని ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రముఖ ప్రజా వాగ్గేయ కళాకారులు సాంబరాజు యాదగిరి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ప్రజానాట్యమండలి సూర్యాపేట జిల్లా మూడవ మహాసభల సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు బచ్చల కూర రాంబాబు, బూర్గుల ప్రభాకర్, పఠాన్ మహబూబ్ అలీ, సంధ్య అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.1943 స్థాపించబడి నేటికీ 82 వసంతాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. దేశంలోనే అత్యధిక సాంస్కృతిక బృందాలు, ప్రజా కళా సైన్యం కలిగిన ఏకైక సాంస్కృతిక సంఘం ప్రజానాట్యమంటున్నారు. కళ కళ కోసం కాదని, కాసుల కోసం కాదని కల ప్రజల కోసం, వారి ప్రగతి కోసం అని ప్రజానాట్యమండలి పనిచేస్తుందన్నారు. ఉద్యమ ప్రస్థానములు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిందన్నారు. అనేక ప్రజా పోరాటాలకు తమ పాట, ఆట ద్వారా చైతన్యం కలిగించి హక్కుల సాధనకు అండగా నిలిచిందన్నారు. విష సంస్కృతి, మనుధర్మ శాస్త్రం, మతం, మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజానాట్యమండలి నికరంగా పోరాటం చేస్తుందన్నారు. యువతను చెడు మార్గం పట్టిస్తున్న డ్రగ్స్ కు వ్యతిరేకంగా గళం విప్పుతుందన్నారు. కార్మిక, రైతాంగ, వ్యవసాయ కార్మిక, మహిళ, విద్యార్థి, యువజన సంఘాలకు అండగా ప్రజానాట్యమండలి ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జానపద, వృత్తి కళాకారులు లక్షలాదిగా ఉన్నారని వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు కృషి చేయకపోవడం దురదృష్టకరమన్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, సామాజిక సమస్యలపై నిత్యం పనిచేస్తుందన్నారు. మహాసభల ప్రారంభ సూచికంగా ప్రజానాట్యమండలి జెండాను జిల్లా అధ్యక్షులు బచ్చల కూర రాంబాబు ఎగరవేశారు.ఈ మహాసభల సందర్భంగా గత మూడు సంవత్సరాల కాలంలో వివిధ కారణాల రీత్యా అమరులైన కళాకారులకు, ప్రజా ఉద్యమకారులకు కల అభిమానులకు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు.
ప్రజానాట్యమండలి నూతన జిల్లా కమిటీ ఎన్నిక.
ప్రజానాట్యమండలి నూతన సూర్యాపేట జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా బచ్చల కూర రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేల్పుల వెంకన్న తో పాటు 11 మందితో ఆఫీస్ బేరర్స్,14 మందితో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలోసూర్యాపేట డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులు పిడమర్తి అశోక్ యాతాకుల ప్రవీణ్, కోదాడ డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులు జిల్లా పెళ్లి నరేష్, నందిపాటి సతీష్, సంధ్య, నెమ్మాది మనోజ్, జె.సాయి, తుంగతుర్తి డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పోలేపాక శ్రీను, బూర్గుల ప్రభాకర్,కామల్ల పరమేష్, పఠాన్ మహబూబ్ అలీ, ఎస్.కె సైదులు,మామిడి నాగ సైదులు,బత్తిని రాములు, సిరిపంగి సోమన్న, నెమ్మాది సతీష్, ఈదయ్య, డి చిరంజీవి, రాధా, ఐలమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

