మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత ఒకటిన్నర రోజుల్లోనే సిలిండర్ను ఇంటి వద్దకు డెలివరీ చేయాలని ఆయన ఆదేశించారు.ఆర్టీజీఎస్ కేంద్రంలో గ్యాస్ సరఫరా సంస్థలతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రజలు గ్యాస్ బుక్ చేసిన వెంటనే స్పందించి, ఆలస్యం లేకుండా సరఫరా చేయాలని కంపెనీలకు స్పష్టం చేశారు. ఇలా వేగంగా డెలివరీ చేయడం వల్ల ప్రజల్లో ఉన్న ఆందోళనలు తగ్గుతాయని తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 17,209 టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అలాగే 1,154 ఏజెన్సీలు ఓటీపీ విధానంలో సిలిండర్లను డెలివరీ చేస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంలో ప్రతి డెలివరీ సమయంలో ఓటీపీ తప్పనిసరిగా నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీని ద్వారా అక్రమాలు, బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు.
గ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించిన సీఎం, అవసరమైతే ఆర్టీజీఎస్ ద్వారా సాంకేతిక సహాయం అందిస్తామని తెలిపారు. ఓటీపీ సంబంధిత సమస్యలు ఎదురైతే గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలని సూచించారు.ఇక గ్యాస్ దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పైప్లైన్ గ్యాస్ సరఫరా విస్తరణపై దృష్టి పెట్టాలని, అలాగే ఇండక్షన్ స్టవ్ల వంటి ప్రత్యామ్నాయాలపై కూడా పరిశీలన చేయాలని సూచించారు.
అత్యవసర సేవలైన ఆస్పత్రులు, పాఠశాలలు, దేవాలయాలకు గ్యాస్ సరఫరా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని సీఎం స్పష్టం చేశారు. అలాగే అన్న క్యాంటీన్లకు గ్యాస్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇరాన్-ఇజ్రాయెల్ పరిస్థితుల ప్రభావం వల్ల భవిష్యత్తులో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున, ముందస్తు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
