మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ వేదికపై మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ కాబూల్లో జరిపిన వైమానిక దాడులపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. కాబూల్ లోని ఓ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో భారీ ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం.ఈ ఘటనలో సుమారు 400 మంది పౌరులు మృతి చెందగా, 250 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒమిడ్ వ్యసన చికిత్స ఆసుపత్రి పై దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.ఈ ఘటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోవడం అమానుషమని, ఇది “పిరికిపంద చర్య” అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఏ విధంగానూ సమర్థించలేనిదని స్పష్టం చేసింది.
అదేవిధంగా ఈ దాడి ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారంపై నేరుగా దాడి చేసినట్లేనని భారత్ పేర్కొంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ఇది ముప్పు అని హెచ్చరించింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే చర్యగా ఈ ఘటనను అభివర్ణించింది.ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ప్రభుత్వం ఖండించింది. తాము కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేశామని, పౌర స్థావరాలు లేదా ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోలేదని వివరణ ఇచ్చింది.
