మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనపరచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమైందని ఆయన ఆరోపించారు.భారత భద్రతకు కీలకంగా పనిచేస్తున్న పరిశోధన మరియు విశ్లేషణ విభాగం (రా), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వంటి సంస్థలను విమర్శించే హక్కు కాంగ్రెస్కు లేదని స్పష్టం చేశారు.అమెరికా మత స్వేచ్ఛ ప్యానెల్ అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యునైటెడ్ స్టేట్స్ కమిషన్ (USCIRF) తాజా నివేదిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నివేదికలో RSS, RAW వంటి సంస్థలపై ఆంక్షలు విధించాలని సూచించడాన్ని కాంగ్రెస్ సమర్థించడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే USCIRF నివేదికను ఏకపక్షంగా, వాస్తవాలకు విరుద్ధంగా ఉందని ఖండించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.అదేవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా దేశ వ్యతిరేక ధోరణిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశంలో సంక్షోభాల సమయంలో భయాందోళనలు సృష్టించడం, వదంతులు వ్యాప్తి చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.భారతదేశ భద్రత కోసం RAW సహా అనేక సంస్థలు నిరంతరం శ్రమిస్తున్నాయని, RSS సమాజ ఐక్యత కోసం పనిచేస్తున్న సంస్థ అని ఆయన తెలిపారు. ఇటువంటి సంస్థలపై చర్యలు కోరడం కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టంగా చూపిస్తుందని అన్నారు.
