మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ఎల్పీజీ సరఫరా అంశంపై ఆర్టీజీఎస్ నుంచి పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో చర్చించారు.ఈ సమావేశంలో గెయిల్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) అధికారులు, సీఎస్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, మరో కొంత గ్యాస్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరత లేకుండా సరఫరా కొనసాగించాలన్నారు.ప్రజలు ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, ఈకేవైసీ, ఓటీపీ విధానాల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ నివారించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇండక్షన్ స్టవ్స్ లభ్యత పెంచి ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయాలని సూచించారు.మరోవైపు రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టాలని, కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎన్జీ, పీఎన్జీ వినియోగాన్ని పెంచే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.
