మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈసారి మమతా బెనర్జీ నందిగ్రామ్ను వదిలి భవానీపూర్ నుంచి పోటీ చేయనున్నారు. 2021 ఎన్నికల్లో సువెందు అధికారి చేతిలో నందిగ్రామ్లో ఓటమి చెందిన విషయం తెలిసిందే. అనంతరం భవానీపూర్ ఉపఎన్నికలో గెలిచి ఆమె అసెంబ్లీలోకి ప్రవేశించారు.ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ టికెట్ను పవిత్ర కార్కీకి కేటాయించిన టీఎంసీ… భవానీపూర్లో మమతా బెనర్జీకి బలమైన పోటీగా సువేందు అధికారిని బీజేపీ బరిలోకి దింపే అవకాశం ఉందని తెలుస్తోంది.
అభ్యర్థుల జాబితాలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పార్టీ వెల్లడించింది. మొత్తం అభ్యర్థుల్లో 52 మంది మహిళలు, 95 మంది ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందినవారు, 47 మంది మైనారిటీలకు చెందినవారని పేర్కొన్నారు.డార్జిలింగ్ ప్రాంతంలో అనిత్ థాపా నేతృత్వంలోని బీజీపీఎం (BGPM) కు మూడు స్థానాలు కేటాయించినట్లు మమతా తెలిపారు.అలాగే ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆమె… రాబోయే ఎన్నికల్లో టీఎంసీ 226కు పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

