మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల్లో టికెట్ ఛార్జీలను ఏకంగా 50 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.మార్చి 17 నుంచి 23 వరకు పండుగ రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ… ఈ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది. డీజిల్ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.అయితే సాధారణ (రెగ్యూలర్) బస్సుల్లో మాత్రం పాత ఛార్జీలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. కేవలం పండుగల కోసం నడిపే ప్రత్యేక బస్సుల్లోనే అదనపు ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది.మహిళలకు అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం యథాతథంగా కొనసాగుతుందని, పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని పేర్కొంది.ఇక ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగించేలా ఆర్టీసీ మరో శుభవార్త కూడా తెలిపింది. త్వరలో సుమారు 2,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ బస్సులను ఓలెక్ట్రా గ్రీన్టెక్, ఈవీ ట్రాన్స్, గ్రీన్సెల్ మొబిలిటీ సంస్థలు సరఫరా చేయనున్నాయి. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ కొత్త బస్సులను కేటాయించనున్నారు. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి పర్యావరణాన్ని కాపాడడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకు సాగుతోంది.
