మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఏపీ ప్రజలకు ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభిస్తూ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చు. 40 శాతం పైగా వైకల్యం ఉన్న వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది.ఇప్పటివరకు కేవలం 4 వర్గాలకే పరిమితమైన ఈ పథకాన్ని ఇప్పుడు 21 వర్గాల దివ్యాంగులకు విస్తరించారు. ఆటిజం, పార్కిన్సన్స్, తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది.దివ్యాంగులతో పాటు వారి సహాయకులకు కూడా 50 శాతం బస్సు ఛార్జీల రాయితీ ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 12.76 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు.ఈ పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.207 కోట్ల భారం పడనుంది. గతంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు.ఈ సౌకర్యం రాష్ట్రంలోని సుమారు 73% బస్సుల్లో అమలవుతుంది. ఇప్పటికే ఉన్న పాసులతోనే దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చు.
