మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రాజెక్టు వివాదం మళ్లీ వేడెక్కింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కే.టి. రామారావు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.మూసీ అభివృద్ధి పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై నిరసనగా ఈరోజు అసెంబ్లీ సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించారు.ప్రభుత్వం ప్రకటించిన 50 మీటర్ల బఫర్ జోన్ నిబంధనలను తప్పుగా అమలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. 50 మీటర్ల పరిధిలో కాకుండా, దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్ ప్రాంతానికి కూడా నోటీసులు జారీ చేశారని ఆయన విమర్శించారు.ఇంకా, మొదటగా 1,400 ఇళ్లు మాత్రమే కూల్చివేస్తామని చెప్పి, ఇప్పుడు 10,000కు పైగా ఇళ్లకు నోటీసులు పంపడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోందని అన్నారు.ఈ చర్యల వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
