మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఆన్లైన్ సేవల్లో మరో అడుగు ముందుకేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అద్భుతమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతు బజార్ల నుంచి నేరుగా కూరగాయలు, పండ్లు ఇంటికే డెలివరీ అయ్యేలా ‘డిజి రైతు బజార్’ అనే యాప్ను ప్రారంభించింది. ఇప్పటివరకు స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్, బిగ్బాస్కెట్ వంటి ప్రైవేట్ యాప్స్ అందిస్తున్న సేవల తరహాలోనే, ఇప్పుడు ప్రభుత్వం కూడా తక్కువ ధరలకు ఈ సేవలను అందిస్తోంది.
మొదట విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభమైన ఈ సేవలు విజయవంతం కావడంతో, ఇప్పుడు కాకినాడ, గుంటూరు, విజయవాడ వంటి నగరాలకు విస్తరించాయి. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.
సేవల ప్రత్యేకతలు:
- సమీపంలోని రైతు బజార్ నుంచి నేరుగా సరఫరా
- రైతు బజార్ ధరలకే ఉత్పత్తులు
- 5 కిలోమీటర్ల పరిధిలో ఫాస్ట్ డెలివరీ
- తాజా కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు అందుబాటులో
- ఆన్లైన్ పేమెంట్ & క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం
డెలివరీ కోసం ప్రభుత్వం Machint సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో వినియోగదారులకు వేగంగా సరుకులు చేరుతున్నాయి.
ఎలా ఆర్డర్ చేయాలి?
- గూగుల్ ప్లే స్టోర్లో ‘డిజి రైతు బజార్’ యాప్ డౌన్లోడ్
- మొబైల్ నెంబర్తో OTP ద్వారా లాగిన్
- లొకేషన్ సెలెక్ట్ చేసి సమీప రైతు బజార్ ఎంపిక
- కావాల్సిన సరుకులు యాడ్ చేసి ఆర్డర్
- ఆన్లైన్ లేదా COD ద్వారా చెల్లింపు
ఛార్జీలు:
- కనీస ఆర్డర్: రూ.100
- రూ.100 కంటే తక్కువైతే: రూ.49 డెలివరీ + ఇతర ఛార్జీలు
ఈ కొత్త సేవతో రైతులకు మంచి మార్కెట్ లభించడంతో పాటు, వినియోగదారులకు తక్కువ ధరలో తాజా సరుకులు అందే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
