మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): మొక్కజొన్న రైతుల సమస్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు.చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని నిరసన తెలిపిన నేతలు, రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వాలని, అలాగే కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. అనంతరం గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు.
అయితే శాసనసభ ప్రాంగణంలోకి మొక్కజొన్న కంకులను అనుమతించకపోవడంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు, “రైతులంటే అంత చులకనా?” అంటూ పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.



