Breaking News

Lokesh with Peddamma... Criticism of YCP

పెద్దమ్మతో లోకేష్…  వైసీపీ విమర్శలు

విజయవాడ, అక్టోబరు 12:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పురంధేశ్వరిని తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా వైసీపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. పురంధేశ్వరి ఏపీ భారతీయ జనతాపార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ విమర్శలు చేస్తుంది. ఇప్పటికీ సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి ఒకప్పటి టీడీపీ నేతలు బీజేపీలో చేరినా… చంద్రబాబుతో నిత్యం టచ్‌లోనే ఉన్నారనేది వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. దీనికి తోడు పురంధేశ్వరి కూడా చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ వాదన. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇసుక తవ్వకాలు, కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లాయని, సర్పంచ్‌ల సమస్యలు…ఇలా ఏదొక అంశంపై పురందేశ్వరి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కేంద్రానికి కూడా పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. ఆమె టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేయడంతో రెండు పార్టీల మధ్య వివాదం ముదిరింది. సజ్జల వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే లోకేష్‌తో కలిసి పురందేశ్వరి కేంద్ర మంత్రి అమిత్ షాను కలవడం మరింత చర్చకు దారితీసింది.వైసీపీ ఆరోపణలపై ఒక్కసారి మాత్రమే పురంధేశ్వరి స్పందించారు. అధికార పార్టీ చేసే ప్రతి ఆరోపణకు నేను స్పందించాల్సిన అవసరం లేదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఢిల్లీలో నారా లోకేష్ అమిత్ షాను కలిసినప్పుడు పక్కనే పురంధేశ్వరి కూడా ఉండటంతో తమ అనుమానాలు బలపడ్డాయంటున్నారు వైసీపీ నేతలు. అయితే ఈ ఇద్దరితో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. కానీ లోకేష్ ను ఆయన పెద్దమ్మ పురందేశ్వరి దగ్గరుండి అమిత్ షా వద్దకు తీసుకెళ్ళారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీ కోసమే పురంధేశ్వరి ఎక్కువగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీడీపీతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండి.. మరోపార్టీ నాయకుడిని అమిత్ షా వద్దకు ఎలా తీసుకెళ్లారని ప్రశ్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో కొంతమంది నేతలు టీడీపీకి ఎక్కువగా పనిచేస్తున్నారని తాము చెబుతున్న మాటలు నిజమయ్యాయని వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.వైసీపీ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ, టీడీపీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నారా లోకేష్ ఢిల్లీలో అమిత్ షాను కలవడం వెనుక పురంధేశ్వరి లేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. లోకేష్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులును, చంద్రబాబుపై కేసులను వివరించేందుకు అమిత్ షాను లోకేష్ కలిసారని చెబుతున్నారు. లోకేష్ వెళ్ళేసరికి పురంధేశ్వరి కూడా అక్కడే ఉన్నారని అంటున్నారు. పురంధేశ్వరితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారని చెబుతున్నారు. ప్రణాళిక ప్రకారం లోకేష్, పురందేశ్వరి కలిసి వెళ్లలేదని చెబుతున్నారు అచ్చెన్నాయుడు. మరోవైపు పురంధేశ్వరిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా ఆందోళనలకి దిగుతున్నారు .మొత్తానికి ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఇప్పుడు పురంధేశ్వరిని కేంద్రంగా చేసుకుని విమర్శలు ప్రతివిమర్శలకు దిగడం చర్చకి దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *