ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ సంయుక్త దాడులను ఖండించండి
మండారి డేవిడ్ కుమార్ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి
కోదాడ ,మార్చ్ 18(నేటి తెలుగు పత్రిక): అమెరికా సామ్రాజ్యవాద దేశం ఇతర దేశాలపై తన పెత్తనం కోసం చేస్తున్న దాడుల మూలంగా సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక లాల్ బంగ్లాలో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ అమెరికా ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్ పై చేస్తున్న దాడుల మూలంగా మన దేశంతో పాటు, ఇతర దేశాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు. యుద్ధం వలన గ్యాస్ సమస్య మన దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందని సామాన్య ప్రజలు, హోటల్ యజమానులు, సంక్షేమ హాస్టల్ సిబ్బందులు గ్యాస్ దొరకకపోవటం మూలంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, దేశంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ మాత్రం గ్యాస్ కొరత లేదని చెప్తూ కాలం వెళ్లదీస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాటలకు ఆచరణకు పొంతన లేకుండా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధం సాకుతో గ్యాస్ సరఫరా కావటం లేదని అదునుగా భావించి గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపటం సరైంది కాదని వారన్నారు. గ్యాస్ కొరత సాకుతో గ్యాస్ ఏజెన్సీ వారు విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ చేస్తూ దందాలు చేస్తున్నారు. గ్యాస్ కొరతతో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు కట్టెల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని, హోటల్ యజమానులు హోటల్ మూసివేయడంతో కార్మికులు వారి ఉపాధిని కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా చూడాలని వారు కోరారు. ఇరాన్ పై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు. ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న దాడులను ఖండించడంలో మోడీ మౌనవహించడము వెనక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు పోటు లక్ష్మయ్య, అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి వక్కవంతుల నరసింహారావు, పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి, ఏఐకేఎంఎస్ డివిజన్ కార్యదర్శి నాగయ్య పాల్గొన్నారు.
