మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో జమిలి ఎన్నికల అంశం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి మరింత ఊతమిచ్చాయి. 2028లో కాకుండా 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని ఆయన సంకేతాలు ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.ఇటీవల ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… “జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు. అదే వ్యాఖ్యలను శాసనసభలో కూడా పునరుద్ఘాటించడంతో… తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా 2023లో ఎన్నికలు జరిగినందున 2028లో మళ్లీ ఎన్నికలు జరగాలి. అయితే జమిలి ఎన్నికలు అమలు చేస్తే కాలవ్యవధిలో మార్పులు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై ముందుకు సాగుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించింది. ఇందులో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. అయితే జమిలి ఎన్నికలు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. దీనిపై రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం వల్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. అయినప్పటికీ సీఎం రేవంత్ వ్యాఖ్యలతో 2029లోనే ఎన్నికలు జరిగే అవకాశాలపై చర్చ మరింత వేగం పుంజుకుంది.
