మార్చి 19, నేటి తెలుగు పత్రిక: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 27న జరిగే తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందజేశారు. భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో జరిగే ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం భారీగా భక్తులను ఆకర్షిస్తాయి.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డితో పాటు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.భక్తుల సమక్షంలో జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించనున్నాయి.
