మార్చి 20, నేటి తెలుగు పత్రిక: ఉగాది సందర్భంగా తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక శుభవార్తలు తెలిపారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదా బైనామా భూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు ప్రకటించారు.గతంలో ధరణి పోర్టల్ కారణంగా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగిస్తూ, ‘భూ భారతి’ ద్వారా భూ రికార్డులను శుద్ధి చేసి రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఇక రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల పంపిణీకి కూడా తేదీ ఖరారైంది. ఈ నెల 22న సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు జమ చేయనున్నారు. ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12,000 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇప్పటికే రైతు భరోసా కింద రూ.18,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.అదనంగా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా సన్న బియ్యం సాగు చేసే రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నామని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి రైతులను అప్పుల భారంనుంచి గట్టెక్కించామని తెలిపారు.వ్యవసాయం రాష్ట్రానికి వెన్నెముక అని, రైతులు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిని ‘రైతు సంక్షేమ సంవత్సరం’గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
