బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): 46 ఏళ్ల కళామతల్లి సేవకు గుర్తింపుగా ప్రజా కళాకారుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సబ్బని కృష్ణ కు బహుజన సాహిత్య అకాడమీ (బి ఎస్ ఏ) తిరుపతిలో కళారత్న నేషనల్ అవార్డును అందజేసింది. సబ్బని కృష్ణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షునిగా, ప్రముఖ రచయితగా, గాయకుడిగా, దర్శకునిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటు, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలలో వేలాది నాటికలను, నాటకాలను, వీధి ప్రదర్శనలను, ఒగ్గు కథలను, నృత్య నాటికలను ప్రదర్శించి పాలకుల విధానాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. దోపిడీ పాలనకు చమర గీతం పాడాలని తపిస్తూ ఎర్రకోటపై ఎర్రజెండాలను ఎగురవేయాలని నినదించిన, విప్లవ భావజాలం మెండుగా ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రజా పోరాట నాయకుడిగా గుర్తింపు పొందారు. ఎం సి పి ఐ యు పార్టీ మాజీ కేంద్ర నాయకులు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజలకు, కళాకారులకు సుపరిచితులు అయిన సబ్బుని కృష్ణను బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ ప్రెసిడెంట్ నల్ల రాధాకృష్ణ కళా రత్న నేషనల్ అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యు . సుబ్రమణ్యం, డి ఎస్ ఏ నేషనల్ జనరల్ సెక్రటరీ జి. విష్ణువర్ధన్, సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ, కాన్ఫరెన్స్ కన్వీనర్ తోపాటు పలు రాష్ట్రాలకు చెందిన కవులు, కళాకారులు పాల్గొన్నారు.
