మార్చి 20, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ ప్రభావంతో గ్యాస్ సరఫరా ఇంకా సాధారణ స్థితికి రాలేదని తెలిపింది.పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, హోర్ముజ్ జలసంధి గుండా చాలా తక్కువ సంఖ్యలో గ్యాస్ నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయని, దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం పడిందని చెప్పారు.ప్రస్తుతం గృహ వినియోగదారులకు 100% సరఫరా అందిస్తున్నామని ప్రభుత్వం తెలిపినా, పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనలకు లోనై అవసరానికి మించి గ్యాస్ బుకింగ్ చేయవద్దని సూచించింది.
అదేవిధంగా, అవసరమైతే ప్రత్యామ్నాయ ఇంధన వనరులు పీఎన్జీ, కిరోసిన్ లేదా ఇతర మార్గాలను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.ఇక బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 4,500కుపైగా దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సరఫరా వ్యవస్థను సక్రమంగా కొనసాగించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.దేశీయ ఉత్పత్తిని కూడా పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి సుమారు 40% వరకు పెరిగినట్లు వెల్లడించారు. అయినప్పటికీ దిగుమతులపై ఆధారపడటం పూర్తిగా తగ్గలేదని అధికారులు పేర్కొన్నారు.మొత్తానికి, ఎల్పీజీ సంక్షోభం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా వినియోగం చేయాలని, ప్రభుత్వం సరఫరా మెరుగుపరచడానికి చర్యలు కొనసాగిస్తోందని స్పష్టం చేసింది.
