ప్రభుత్వానికి ప్రముఖ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ సూచన
విజయవాడ, మార్చి 20, నేటి తెలుగు పత్రిక: మచిలీపట్నం ప్రాంతంలో ఏపీ మారి టైం బోర్డు తీసుకునే భూములను భూ సమీకరణతో తీసుకుంటే అక్కడ భూములు ఉన్నవారికి మేలు జరుగుతుందని ప్రముఖ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో దాదాపు 9500 ఎకరాల భూములను ఏపీ మారిటైం బోర్డు తీసుకొని మచిలీపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల స్థాపనకు సన్నాహాలు జరుగుతున్నాయని ,ఈ మేరకు మంగినపూడి తదితర 10 గ్రామాల్లో ప్రస్తుతం భూముల సర్వే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నం నార్త్ మండల తహసిల్దార్ పరిధిలో ఈ భూముల సర్వే జరుగుతుందని ఆకుల శ్రీనివాస్ వివరించారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎకరా భూమి ధర మూడు కోట్ల రూపాయల వరకు ఉందని, ఒకవేళ భూ సేకరణలో కనుక తీసుకుంటే రైతులకు అక్కడి భూ యజమానులకు నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. అదే రాజధాని అమరావతి కోసం చేసిన రీతిలో భూ సమీకరణ విధానంలో గనక భూములను సేకరిస్తే రైతులకు పారిశ్రామిక వాణిజ్య ప్రాంతంలో భూమితో పాటు ఇళ్లకు సంబంధించిన స్థలాన్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఆకుల పేర్కొన్నారు. కావున ప్రభుత్వం ఈ ప్రాంతంలోని భూ యజమానులు నష్టపోకుండా భూ సమీకరణ వైపు మొగ్గు చూపిస్తే బాగుంటుందని పలువురు భూ యజమానులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. తన సూచనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి తమ భూములను నమ్ముకుని జీవనం సాగిస్తున్న అక్కడివారికి ఒకవేళ ప్రభుత్వం వారి భూములను తీసుకుంటే వారు మరింత గౌరవప్రదంగా జీవనం సాగించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.
