మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ విద్యావ్యవస్థలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేస్తూ, రాష్ట్రంలో ఇకపై పదో తరగతి బోర్డు పరీక్షలు ఉండకపోవచ్చని వెల్లడించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న +2 విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధమైన విద్యా వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ మార్పుల ప్రకారం టెన్త్ బోర్డు పరీక్షలను తొలగించి, నేరుగా ఇంటర్మీడియట్ స్థాయిలోనే బోర్డు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు.ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా సీఎం స్పందించారు. విచారణ ప్రక్రియ ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ఎవరినీ విచారణ లేకుండా అరెస్ట్ చేయలేమని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నామని చెప్పారు.
కేబినెట్ విస్తరణపై వస్తున్న ఊహాగానాలను కూడా సీఎం ఖండించారు. ప్రతి ఢిల్లీ పర్యటన కేబినెట్ విస్తరణ కోసమే కాదని స్పష్టం చేశారు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.మొత్తంగా, విద్యా రంగంలో పెద్ద మార్పులకు సంకేతాలు ఇస్తూనే, ఇతర రాజకీయ అంశాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు.
