హైదరాబాద్, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లోని మియాపూర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కక్షతో ఒక మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది.కాకినాడకు చెందిన నూకరత్నం అనే మహిళ మియాపూర్లో హౌస్కీపింగ్ పనులు చేస్తూ జీవిస్తోంది. ఇప్పటికే భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత నెల 20న ప్రసాద్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది.అయితే, అదే ప్రాంతంలో వంటమనిషిగా పనిచేస్తున్న అలీషా అలియాస్ పాండు ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 19న తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్తో కలిసి నూకరత్నం ఇంటికి వెళ్లాడు.తన వెంట రావాలని మహిళతో వాగ్వాదానికి దిగిన నిందితుడు, ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురై ముందుగా తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నూకరత్నం తీవ్రంగా గాయపడగా, వెంటనే ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు అలీషా అలియాస్ పాండు మరియు అతని తండ్రి లాలూను అరెస్ట్ చేశారు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
