మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనపై సర్కార్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.ఈ అంశంపై పరిశీలన కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే సమావేశాలు నిర్వహించి, ఉద్యోగ సంఘాలు, నిపుణులు, అధికారులతో చర్చలు జరిపింది. ముఖ్యంగా వయస్సు పెంపుతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వంటి అంశాలను సమగ్రంగా విశ్లేషించినట్లు తెలుస్తోంది.కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా, అందులో రిటైర్మెంట్ వయస్సు పెంపుపై అనుకూల అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,500 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, కార్పొరేషన్లు, అలాగే 9, 10 షెడ్యూల్ సంస్థలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు ఈ నిర్ణయ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.అయితే ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుని, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీంతో ఉద్యోగుల్లో ఆశలు పెరిగాయి.
