మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టాలీవుడ్కు భారీ శుభవార్త అందించింది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డులు మళ్లీ ప్రారంభించేందుకు సర్కార్ ముందడుగు వేసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ఈ విషయాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కళాకారులకు తగిన గౌరవం అందించేందుకు నంది అవార్డులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.ఇక షూటింగ్స్ పరంగా కూడా విశాఖపట్నంను ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ ఉన్న అందమైన లొకేషన్లను ఉపయోగించుకుని సినిమాల చిత్రీకరణకు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు. నిర్మాణ సంస్థలకు కూడా సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు.
గతంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నంది అవార్డులను ప్రదానం చేసేది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. ఇదే సమయంలో తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ప్రారంభం కావడంతో, టాలీవుడ్ నుంచి కూడా నంది అవార్డులను తిరిగి తీసుకురావాలనే డిమాండ్లు పెరిగాయి.ఇటీవల గద్దర్ అవార్డుల వేడుకలో పాల్గొన్న చిరంజీవి, ఆర్.నారాయణ మూర్తి వంటి ప్రముఖులు కూడా ఏపీ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ పరిణామాల మధ్య ఏపీ ప్రభుత్వం స్పందించి, నంది అవార్డుల పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. త్వరలోనే జ్యూరీ ఏర్పాటు చేసి, అధికారికంగా అవార్డుల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
