మార్చి 22, నేటి తెలుగు పత్రిక: భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం అభివృద్ధి పనులపై ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలయ సహజత్వానికి ఎలాంటి భంగం కలగకుండా, పూర్తిగా ఆగమశాస్త్రానికి అనుగుణంగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగిన భూసేకరణ ఆధారంగా రూపొందించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు.
మూడు దశల్లో అభివృద్ధి
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధి పనులను మూడు దశల్లో పూర్తి చేయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా వచ్చే గోదావరి పుష్కరాలు దృష్టిలో ఉంచుకుని మొదటి దశ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పుష్కరాలపై ప్రత్యేక దృష్టి
ఆలయ పరిసరాల్లో పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సీఎం తెలిపారు. 2027 మార్చి 31 నాటికి తొలి దశ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ముందస్తు ప్రణాళికలు
పుష్కరాలు పూర్తయ్యాక మిగతా పనులు కొనసాగించేందుకు ఇప్పటి నుంచే అంచనాలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు, ఎంపీలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
