యాదగిరిగుట్ట : మార్చి 22 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలో చెరువు నిండి అలుగు పోస్తుండటం తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయడంతో మల్లాపూర్ చెరువు జలకళ తో కళకళలాడుతుండగా గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, మల్లన్న సాగర్ జలాలతో ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి చెరువునూ నింపి రైతులకు సాగునీరు అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ఎన్నో సంవత్సరాలుగా నీటి కోసం ఎదురుచూసిన రైతులకు ఇది శుభసూచకమని అన్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ సంకల్పమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.చెరువులు నిండితే పంటలు పండుతాయి, రైతు ఆనందంగా ఉంటాడు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
