మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల స్థాపనకు అడ్డంకిగా ఉన్న 22-ఏ నిషేధిత జాబితా నుంచి ఏపీఐఐసీ భూములను తొలగించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు పరిహారం చెల్లించిన అనంతరం ప్రభుత్వ భూములు, డీకెటీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది.ఈ నిర్ణయంతో ఎలాంటి వివాదాలు లేని దాదాపు 70 వేల ఎకరాల భూములకు క్లియర్ మార్గం ఏర్పడింది. ఇప్పటికే ఏపీఐఐసీ స్వాధీనంలో ఉన్న 51,603 ఎకరాల భూముల మ్యుటేషన్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో ప్రభుత్వ, డీకెటీ, పట్టా భూములు ఉన్నాయి. ఈ భూములను వెబ్ల్యాండ్లో ఏపీఐఐసీ పేరుతో నమోదు చేయాలని అధికారులకు సూచించింది.ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అయితే ఇప్పటివరకు 22-ఏ నిబంధనల వల్ల ఈ భూములపై బ్యాంకు లోన్లు పొందడం, రిజిస్ట్రేషన్లు చేయడం కష్టంగా మారింది. దీంతో ప్రాజెక్టులు ఆలస్యం అవుతూ వచ్చాయి.
ఇప్పుడు ఈ అడ్డంకులు తొలగడంతో పరిశ్రమల స్థాపన వేగవంతం కానుంది. పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు తీసుకుని ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశముంది. దీని ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా విస్తరించనున్నాయి.ఇక మరోవైపు, సుమారు 1.5 లక్షల ఎకరాల దేవాదాయ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గతంలో జరిగిన పొరపాట్ల వల్ల ఇతరుల భూములు కూడా ఈ జాబితాలో చేరడంతో యాజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
