మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఈ వేసవిలో ఎయిర్ కండిషనర్ల (AC) ధరలు పెరగనున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ఖర్చులకు తోడు ఎల్పిజి సరఫరా కొరత, ముడి పదార్థాల ధరల పెరుగుదల వల్ల కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ – ఇజ్రాయెల్ పరిస్థితుల ప్రభావంతో ప్లాస్టిక్ వంటి ముడి పదార్థాల ధరలు పెరిగాయి. దీంతో వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్ల వంటి గృహోపకరణాల ధరలు కూడా 10-12% వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.ఇక మరోవైపు, ఫ్యాక్టరీలకు ఎల్పిజి సరఫరా తగ్గడం పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం దేశీయ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ పరిశ్రమలకు గ్యాస్ సరఫరాను పరిమితం చేయడంతో ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఏసీ తయారీలో ఉపయోగించే పెయింటింగ్ డ్రైయింగ్ ప్రక్రియలో ఎల్పిజి కీలక పాత్ర పోషిస్తుంది. సరఫరా ఇలాగే తగ్గితే ఉత్పత్తిని 20-30% వరకు తగ్గించాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు.
ఇదిలా ఉండగా, ఈసారి అకాల వర్షాలు కూడా కంపెనీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా మార్చిలోనే వేడి పెరిగి ఏసీలకు డిమాండ్ పెరుగుతుంది. కానీ వాతావరణ మార్పులతో అమ్మకాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్లో ఉష్ణోగ్రతలు పెరిగితే డిమాండ్ పుంజుకునే అవకాశం ఉందని కంపెనీలు భావిస్తున్నాయి.కొత్త ఎనర్జీ లేబులింగ్ నిబంధనలు కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి ఏసీల ధరలు 5-10% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
