మార్చి 23, నేటి తెలుగు పత్రిక: అమెరికాలోని లాగార్డియా విమానాశ్రయం లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రన్వేపై ప్రయాణానికి సిద్ధమవుతున్న ఓ విమానం అగ్నిమాపక వాహనాన్ని ఢీకొనడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం, అయితే అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.ప్రమాద సమయంలో విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఢీకొన్న ప్రభావంతో విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై అమెరికా విమానయాన నియంత్రణ సంస్థలు, ప్రమాదాల పరిశీలనా బృందాలు వెంటనే దర్యాప్తు ప్రారంభించాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ, అగ్నిమాపక వాహనం వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. పలుమార్లు హెచ్చరించినప్పటికీ వాహనం ఆగకపోవడం అనుమానాలకు తావిస్తోంది.ఇదిలా ఉండగా, ఈ ప్రమాదాన్ని ఉగ్రదాడి కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఘటన అనంతరం విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి, రాకపోకలను నిలిపివేశారు. ఈ సంఘటనతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
