మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించనున్నట్లు ప్రకటించింది.ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో వెల్లడించారు. మొత్తం రూ.3,24,234 కోట్ల బడ్జెట్లో భాగంగా పలు సంక్షేమ పథకాలతో పాటు “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా”ను ప్రకటించారు.ఈ పథకం ప్రకారం, రాష్ట్రంలోని రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ అందించనున్నారు. సుమారు 1.15 కోట్ల కుటుంబాలు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది.కుటుంబంలో ఆదాయం సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో, ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
