మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేనేత, మరమగ్గ కార్మికులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మంత్రి సావిత్రి వివరాల ప్రకారం, ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. హ్యాండ్లూమ్ కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్లూమ్ (మరమగ్గ) కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. విజయవాడలో జరిగిన గాంధీ బునకర్ మేళా, జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. చేనేత కార్మికుల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేనేతల సమస్యలను అర్థం చేసుకుని పలు సంక్షేమ చర్యలు చేపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.ఇక ఎన్నికల హామీల మేరకు 50 ఏళ్ల వయస్సులోనే రూ.4,000 పింఛన్ అందిస్తున్నామని, చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు రుణాలు, శిక్షణ, సబ్సిడీలు కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
