మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడుతోంది. ఉక్కు రంగంలో అగ్రగామి సంస్థ ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా రాష్ట్రంలో భారీ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఈ ప్రాజెక్టుకు ఈనెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రులతో కలిసి భూమిపూజ చేయనున్నారు.రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ సంవత్సరానికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.మొత్తం 5,465 ఎకరాల్లో రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరగనుంది. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ అభివృద్ధి చేయనున్నారు.
ఇదే కాకుండా, ఈ స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్ట్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అదనంగా రూ.11,198 కోట్ల పెట్టుబడి పెట్టి, మరో 6 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.ఈ ప్రాజెక్ట్తో విశాఖ ప్రాంతం పరిశ్రమల హబ్గా రూపుదిద్దుకునే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హెచ్. డి. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. అలాగే సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ కూడా పాల్గొననున్నారు.
