మార్చి 23, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వ విధానాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు.శాంతియుత నిరసనలను అణచివేయడం ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనమని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా ‘పోలీస్ రాజ్యం’ కొనసాగుతోందని విమర్శించారు.
అలాగే, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అరెస్టులకు దిగుతున్నారని అన్నారు. రైతులు, యువత, మహిళలు ఎదురుచూస్తున్న హామీలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. కమిషన్ల వసూళ్లపైనే దృష్టి పెట్టి ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని కూడా ఆరోపించారు.అరెస్టులు, లాఠీచార్జీలతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేసిన కిషన్ రెడ్డి, ప్రజల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మరింత బహిర్గతం చేస్తామని హెచ్చరించారు.
