95వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు త్యాగాలను స్మరించిన ఏఐవైఎఫ్ నాయకులు
ఉరితాడునే పూలమాలగా స్వీకరించిన అమర వీరులు
దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలు అర్పించిన విప్లవ వీరులకు నివాళులు
యువతకు మార్గదర్శకులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్
విప్లవ జ్వాలలు రగిలించిన అమరుల త్యాగం చిరస్థాయి
మంగళగిరి మార్చి 23 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన అమర వీరులు సర్దార్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు వారి 95వ వర్ధంతి సందర్భంగా ఏఐవైఎఫ్ (అఖిల భారత యువజన సమైక్య) నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం మంగళగిరి పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, అనంతరం మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా దేశభక్తి నినాదాలతో పరిసరాలు మారుమోగాయి.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు జాలాది నవీన్ మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడిన మహావిప్లవ యోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. “ఇంక్విలాబ్ జిందాబాద్” అనే నినాదంతో యువతలో జాతీయ చైతన్యం రగిలించిన మహనీయుడని పేర్కొన్నారు.దేశాన్ని సంపూర్ణ స్వాతంత్ర్యం వైపు నడిపించేందుకు భగత్ సింగ్ తన సహచరులు రాజ్ గురు,సుఖదేవులతో కలిసి చేసిన త్యాగాలు అపూర్వమని అన్నారు.భగత్ సింగ్ చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో చేరి, బ్రిటిష్ దమనకాండకు వ్యతిరేకంగా విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. లాహోర్ కుట్ర కేసులో అరెస్టై జైలులో గడిపిన రోజుల్లో కూడా ఆయన తన సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేస్తూ పోరాటాన్ని కొనసాగించారు. “ఇంక్విలాబ్ జిందాబాద్” అనే నినాదంతో యువతలో జాతీయ చైతన్యాన్ని రగిలించారు. కేవలం 23 ఏళ్ల యుక్తవయసులోనే స్వదేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించి ఉరితాడునే పూలమాలగా స్వీకరించిన ఆ ముగ్గురు అమర వీరులు భారత యువతకు స్ఫూర్తి ప్రదాతలని వివరించారు.విప్లవ భావజాలంతో సామాజిక సమానత్వం, దోపిడీ రహిత సమాజం కోసం వారు చేసిన పోరాటం నేటికీ ప్రాసంగికమేనని పేర్కొన్నారు. వారి ఆశయాలను కొనసాగించడం ద్వారా మాత్రమే వారికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కార్యకర్తలు, సిపిఐ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అమర వీరుల త్యాగాలను స్మరించారు. కార్యక్రమం అంతటా దేశభక్తి నినాదాలు మారుమోగాయి.“భగత్ సింగ్ – రాజ్ గురు – సుఖదేవ్ అమరులే” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు జాలాది విజయ్ కుమార్, పాలెం నాసరయ్య, గుమ్మ మణికంఠ, తరుణ్ నాయక్, సతీష్, రాజ్ కుమార్, నితీష్, స్టాలిన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
